వెంట్రిలాక్విజం కళపై ఆసక్తి ఉన్నవారికి ఓ శుభవార్త! భారతదేశ వెంట్రిలాక్విజం చరిత్రలో తొలిసారిగా ఐదుగురు నొష్ణాతులచే ఓ శిక్షణా శిబిరం మన హైదరాబాద్ లో నిర్వహించబడుతోంది. ఈ కళపై ఆసక్తి ఉన్నవారికి, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వారికి తమ కళను పెంపొందించుకునే దిశలో ఈ శిబిరం తోడ్పడుతుందని నిర్వాహక సభ్యుడైన మిమిక్రీ జనార్ధన్ తెలియచేశారు. గత ఐదు సంవత్సరాల నిర్వహణా అనుభవంతో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిష్ణాతులతో మన హైదరాబాద్ నగరంలో ఇప్పుడు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జనార్ధన్ తెలియచేశారు.
బొమ్మ కదలికల నియంత్రణ, స్వర నియంత్రణ, పెదవుల కలయికపై నియంత్రణ వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని, వీటితో పాటుగా భ్రమ కలిగించడంపై కూడా అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు తెలియచేశారు. ఇకపై ప్రతీ నెలా దేశంలోని ప్రముఖ నగరాల్లో ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. మార్చి 5 మరియు 6వ తేదీల్లో నగరంలోని చిక్కడపల్లిలో ఉన్న త్యాగరాయ గాన సభలో ఈ శిక్షణా శిబిరం నిర్వహించబడుతోంది. రిజిస్ట్రేషన్ మరియు ఎంట్రీ కొరకు 9848060719 నెంబర్ పై సంప్రదించవచ్చు. ఈ శిక్షణా శిబిరంలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ లు మిమిక్రీ శ్రీనివాస్, మిమిక్రీ జనార్ధన్, చెన్నైకి చెందిన వెంకీ, బెంగుళూరు నుండి ఇందుశ్రీ, ప్రక్లాదాచార్యలు శిక్షకులుగా పాల్గొంటున్నారని సమాచారం.